రోడ్డు ప్రమాదాల పెరుగుదలలో తెలంగాణ టాప్.. కేంద్రం నివేదికలో షాకింగ్ నిజాలు!

  • ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల పెరుగుదల
  • 2024లో 13.5 శాతం పెరిగిన యాక్సిడెంట్లు.. కేంద్ర నివేదిక వెల్లడి
  • ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని గుర్తింపు
  • మరణాల వృద్ధిరేటులోనూ దక్షిణ భారతంలో తెలంగాణ టాప్
  • చిన్న ప్రమాదాల నమోదుతోనే సంఖ్య పెరిగిందంటున్న అధికారులు
దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రహదారి ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2023లో రాష్ట్రవ్యాప్తంగా 22,903 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 25,986కి చేరింది. కేవలం ఏడాది కాలంలోనే ప్రమాదాల సంఖ్య 13.5 శాతం పెరగడం గమనార్హం. ఇది జాతీయ సగటు వృద్ధి రేటు (1.5 శాతం) కంటే చాలా రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.

ఈ ప్రమాదాల్లో కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య సైతం భారీగానే ఉంది. 2024లో రాష్ట్రంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో సుమారు 7,900 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల వృద్ధి రేటు (3.7 శాతం) దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే అత్యధికంగా నమోదైంది. 

ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా మితిమీరిన వేగాన్ని అధికారులు గుర్తించారు. ఒక్క అతివేగం వల్లే 7,500 కంటే ఎక్కువ ప్రమాదాలు జరగ్గా, సుమారు 2,760 మంది మృత్యువాత పడ్డారు. వీటితో పాటు హిట్ అండ్ రన్ కేసులు, వాహనాలను వెనుక నుంచి లేదా పక్క నుంచి ఢీకొట్టడం వంటి ఘటనల కూడా వేలాది మంది మరణాలకు కారణమవుతున్నాయి.

అయితే, ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరగడంపై రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. గతంలో నమోదు కాని చిన్న చిన్న ప్రమాదాలను కూడా ప్రస్తుతం రికార్డు చేస్తుండటం వల్లే గణాంకాలలో ఈ పెరుగుదల కనిపిస్తోందని వారు చెబుతున్నారు. 

రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తద్వారా రోడ్ల ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దడం, నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం మరియు ప్రమాద సమయాల్లో తక్షణ అత్యవసర స్పందన వంటి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Telangana
Road Accidents
Ministry of Road Transport and Highways
Over Speeding
Road Safety

More Telugu News